యువ యూట్యూబర్ కోమలి సూసైడ్ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విశాఖకు చెందిన కోమలి హైదరాబాద్‌లో చదువుకుంటూనే యూట్యూబర్‌గా మారింది. చిత్రపురి కాలనీలోని అద్దెకు ఉండే ఇంట్లో ఉరేసుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అఖిల్ రెడ్డి అనే యువకుడితో కోమలి ప్రేమలో ఉండగా.. ఏడాది క్రితం ఇద్దరికి బ్రేకప్ అయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మనస్థాపంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. సూసైడ్‌కు కొన్ని రోజుల ముందు అఖిల్ ఆమె ఉంటున్న గదికి వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక కూతురు మృతిపై కోమలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన తన కూతుర్ని అఖిల్ రెడ్డి పాడెక్కేలా చేశాడని రోధిస్తోంది. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఆమె విషయం తెలియగానే నగరానికి వచ్చినట్లు కన్నీరు మున్నీరుగా విలపించింది. 'అందంగా ఉండే నా కుతుర్ని ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా. అఖిల్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నా కూతుర్ని మోసం చేశాడు. వాడు ప్రేమ పేరుతో దగ్గరై నా కూతుర్ని వాడుకున్నాడు. దాని డబ్బులు కూడా వాడేసుకున్నాడు. చాలా డబ్బులు తిన్నాడు. డబ్బు పోయినా ఫర్వాలేదు. వాడి కారణంగా నా కూతురే లేకుండా పోయింది. ఆర్నేళ్ల క్రితం కూడా నా కూతురు ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పుడు నా కూతురికి నచ్చజెప్పాం. ఇలా చేయటం కరెక్ట్ కాదని వారించాం. అప్పుడు వాడిని వదిలేస్తా అని చెప్పింది. సినీ ఫీల్డ్‌లో గుర్తింపు తెచ్చుకొని హీరోయిన్ అవుతానని ధీమాగా చెప్పింది. అఖిల్ అక్క నాకు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించింది. నా తమ్ముడు చనిపోతాడని బెదిరించింది. కానీ నా కూతురే ఇలా చేసుకుంటుందని ఊహించలేదు. శనివారం నైట్ వాడు నా కూతురు రూమ్‌కి వచ్చి ఆదివారం వెళ్లిపోయాడట. ఆరోజే వాడితో గొడవ పడినట్లు తెలిసింది. ఆ గొడవ తర్వాతే నా కూతురు ఇలా చేసుకుంది. నా కూతురు చావుకు కారణమైన అఖిల్‌ను చట్టపరంగా శిక్షించాలి. నాకు న్యాయం చేయాలి.' అని కోమలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.