బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య.. క్యాంపస్‌లో ఉద్రిక్తత, లవ్ ఫెయిల్యూర్ అంటున్న పోలీసులు

Wait 5 sec.

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. వనపర్తి జిల్లాకు చెందిన వసంత అనే యువతి.. బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే రోజూ లాగే అందరితో ఆడుతూ, పాడుతూ, చదువుతూ ఉన్న వసంత.. అకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడటంతో కాలేజీ, హాస్టల్ పరిసరాల్లో పెను సంచలనం రేపుతోంది. తమతోపాటు కలిసి చదువుకున్న వసంత.. ఒక్కసారిగా విగతజీవిగా పడి ఉండటం చూసి.. ఆమె ఫ్రెండ్స్ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ఇక వసంత ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థినులు.. ట్రిపుల్ ఐటీ యాజమాన్యానికి చెప్పారు. దీంతో వారు పోలీసులు, వసంత తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ వద్దకు చేరుకున్న పోలీసులు.. వసంత మృతదేహాన్ని భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం పంపించారు. అయితే వసంత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది ఇంకా తెలియరాలేదు. మరోవైపు.. వసంత మృతితో క్యాంపస్ పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఏం జరిగింది అని తెలుసుకునేందుకు ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్స్‌లర్‌ను సంప్రదించేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆయన అందుబాటులో లేరని ట్రిపుల్ ఐటీ సిబ్బంది చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు బైంసా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీగా పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలోకి మీడియాను రానీయకపోవడంతో పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.ఇక.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వసంత మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే వసంత మృతికి కారణం లవ్ ఫెయిల్యూర్ అంటూ ప్రాథమికంగా పోలీసులు చెబుతున్నారు. ఆమె ఒక యువకుడిని ప్రేమించిందని.. కానీ వారి మధ్య మనస్పర్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ యువకుడు ఇటీవలె తమ గ్రామంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని.. అది భరించలేకే వసంత కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.