తిరుమలలో మరోసారి అపచారం జరిగింది.. నిబంధనలను ఉల్లంఘించి రీల్స్ చేయడం వివాదాస్పదం అయ్యింది. బిగ్‌బాస్ ఫేమ్ మరో నలుగురితో కలిసి చేసిన ఓ రీల్ వైరల్ అయ్యింది. తిరుమల ఘాట్ రోడ్డుతో పాటుగా శ్రీవారి ఆలయం ముందు డ్యాన్స్ చేస్తూ వీడియో తీశారు. ఆ రీల్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తిరుమలలో టీటీడీ నిబంధనల్ని ఉల్లంఘించి రీల్స్ చేయడం వివాదంగా మారింది. ఖడ్గం సినిమాలోని గోవిందా, గోవిందా అనే పాటకు డ్యాన్స్ చేస్తూ ఈ రీల్ చేశారు. అయితే ఈ రీల్ వైరల్ కావడంతో వెంటనే ఇన్‌స్టా నుంచి తొలగించారు. తిరుమలలో నిబంధనలు పాటించాలని టీటీడీ పదే, పదే చెబుతోంది.. అలాగే శ్రీవారి ఆలయం దగ్గర మైక్‌లో కూడా ప్రచారం చేస్తున్నారు. అయినా సరే కొందరు పట్టించకోవడం లేదు.టీటీడీ నిబంధనల ప్రకారం.. తిరుమలలో రాజకీయ ప్రసంగాలతో పాటుగా రీల్స్ చేయడం, ఫోటోషూట్‌లు చేయడం వంటి వాటిని నిషేధించారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర మైక్‌లో కూడా భక్తులకు తెలిసేలా హెచ్చరిస్తున్నారు. అయినా సరే ఇటీవల కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల తమిళనాడుకు చెందిన యువకులు శ్రీవారి ఆలయం ముందు రాజకీయ పార్టీకి సంబంధించిన ఓ ఫ్లెక్సీని తీసుకొచ్చి రీల్స్ చేశారు. ఈ వ్యవహారంపై టీటీడీ స్పందించింది.. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈమధ్య కొత్తగా వివాహమైన ఓ జంట తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఫోట్‌షూట్ చేశారు. అయితే ఆ జంట తమకు టీటీడీ నిబంధనలు గురించి తెలియదని.. క్షమించమంటూ వీడియోను విడుదల చేశారు. తాజాగా గీతూ రాయల్ శ్రీవారి ఆలయం ముందు రీల్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఈ రీల్ వ్యవహారంపై టీటీడీ స్పందించాల్సి ఉంది.అంతేకాదు టీటీడీ తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయడంపై నిషేధం విధించింది. కొండపై నేతలు రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నిబంధనను అమలు చేస్తోంది. కొంతమంది నేతలు నిబంధనలు ఉల్లంఘించి ప్రసంగాలు చేయడంతో వారిపై కేసులు నమోదయ్యాయి. అంతేకాదు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు కూడా తిరుమలలో ఫోటోషూట్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. వీరిపై తిరుమ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇలా చాలామంది నిబంధనలు ఉల్లంఘించి తిరుమలలో రీల్స్, ఫోటోషూట్‌లు, వీడియోలు తీసి వివాదంలో చిక్కుకున్నారు. టీటీడీ భక్తుల్ని ఎన్నిసార్లు హెచ్చరించినా సరే తిరుమలలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసినా కొంతమంది తీరు అస్సలు మారడం లేదు.