గత కొన్ని నెలలుగా ఇరాన్‌ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడంతో పక్కాగా ప్లాన్ చేసి.. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ సుప్రీం లీడర్‌ను మట్టి కరిపించాయి. అయితే శనివారం రోజున ఇరాన్‌పై దాడులు చేసిన ఇజ్రాయెల్.. ఖమేనీని హతం చేసినట్లు ప్రకటించింది. కానీ.. ఖమేనీపై కొన్ని నెలల నుంచే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సహకారంతో అమెరికా నిఘా సంస్థ సీఐఏ నిఘా పెట్టింది. ప్రతీ కదలికపై పక్కాగా సమాచారం సేకరించి.. దాడులు చేసి.. అతడిని చంపేశాయి. ఇక ఈ దాడిలో ఇజ్రాయెల్ పదుల సంఖ్యలో బాంబులతో విరుచుకుపడింది. అదే సమయంలో టెక్నాలజీని ఉపయోగించిన అమెరికా.. అత్యాధునిక ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఈ ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీలో వినియోగించింది. శనివారం రోజున ఖమేనీ తన సలహాదారులు షాంఖానీ, సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి అలీ లరిజానీతో సమావేశం అయ్యారు. ఖమేనీ పరిపాలన భవనాల్లో ఒక చోట ఈ సమావేశం జరగనున్నట్లు గుర్తించిన అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు.. అక్కడే దాడిచేయాలని భావించాయి. అయితే అందులో ఖమేనీ ఎక్కడ ఉన్నారో కచ్చితమైన సమాచారం లభించలేదు. ఖమేనీ శనివారం సాయంత్రమే భేటీ కావాల్సి ఉన్నా.. అది ఉదయానికి వాయిదా పడినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఖమేనీ నివాసం ఉండే లీడర్‌షిప్‌ హౌస్‌.. దాని సమీపంలో 30 బాంబులతో ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు దాడులకు దిగినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. ఇరాన్‌ ఆర్మీ, ప్రభుత్వ పెద్దలు సంయుక్త సమావేశం నిర్వహిస్తే దాడులు చేసి.. అందర్నీ ఒకేసారి మట్టుబెట్టాలని అమెరికా వేచి చూస్తోంది. అయితే శనివారం రోజున ఇరాన్ ప్రభుత్వం, ఆర్మీ మధ్య 3 సమావేశాలు జరగనున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్‌లకు సమాచారం అందింది. ఖమేనీ ఉండే పక్కా అడ్రస్ కూడా దొరకడంతో అమెరికా-ఇజ్రాయెల్‌ దళాలు చేసిన తొలి దాడిలోనే ఖమేనీని మట్టుబెట్టాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియాన్‌ను కూడా హతమార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఇక ఇదే సమయంలో ఆంథ్రోపిక్‌ క్లౌడ్‌ ఏఐని ఉపయోగించి.. ఇరాన్‌పై అమెరికా దాడులు చేసినట్లు వాల్‌స్ట్రీట్‌ తెలిపింది. ఆ తర్వాత ఆంథ్రోపిక్ ఏఐ టూల్స్‌ను అమెరికా ఫెడరల్‌ ఏజెన్సీలు వినియోగించడంపై ట్రంప్‌ సర్కార్ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఇంటెలిజెన్స్‌ సహకారం, టార్గెట్లను గుర్తించడం, యుద్ధంలో పరిస్థితులను అంచనా వేయడానికి పెంటగాన్ ఈ ఆంథ్రోపిక్‌ ఏఐని ఉపయోగించింది. ఇప్పటికే పాలంటైర్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌తో కలిపి ఆంథ్రోపిక్‌ సంస్థ అమెరికా ఆర్మీకి సేవలందిస్తోంది. అయితే.. అమెరికా రక్షణశాఖతో ఆంథ్రోపిక్‌ విభేదాల కారణంగా ఇటీవల ఫెడరల్‌ ఏజెన్సీల్లో వినియోగించడంపై నిషేధించారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసే సమయంలోనూ అమెరికా ఆంథ్రోపిక్‌ ఏఐని ఉపయోగించినట్లు తెలుస్తోంది. గూగుల్‌, ఓపెన్‌ ఏఐ, ఎక్స్‌ ఏఐ సేవలను కూడా అమెరికా ఉపయోగిస్తోంది. ఈ ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీలో అమెరికా తన అడ్వాన్స్‌డ్ ఆయుధాలను ఉపయోగించినట్లు వార్‌ సెక్రటరీ పీట్‌ హెగ్సెత్‌ తెలిపారు. అందులో స్టెల్త్‌జెట్‌లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకు ఇరాన్‌ వాడుతూ వస్తున్న వన్‌వే డ్రోన్లను ఈ దాడిలో అమెరికా రంగంలోకి దించింది. ఇరాన్‌ పరిసరాల్లోని స్థావరాల నుంచి అమెరికా హిమార్స్‌ రాకెట్‌లను ప్రయోగించింది. వీటితోపాటు దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను కూడా ఉపయోగించింది. అమెరికాలోని అరిజోనా ఫినిక్స్‌‌కు చెందిన స్పెక్ట్రెవర్క్స్‌ తయారు చేసిన లోకాస్ట్‌ అన్‌ మ్యాన్డ్‌ అటాక్‌ సిస్టమ్‌ను ఈ దాడిలో ఉపయోగించినట్లు సమాచారం. ఒక్కో దాని విలువ 35 వేల డాలర్లు మాత్రమేనని తెలుస్తోంది. అదే సమయంలో అమెరికా నమ్మకమైన ఆయుధం తోమహాక్‌ క్షిపణులను కూడా ఉపయోగించారు. ఈ ఒక్కో మిసైల్ ఖరీదు 1.3 మిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం.