రేవంత్‌ రెడ్డి ఇంట్లో రష్మిక.. కొత్త పెళ్లికూతురికి బట్టలు పెట్టిన సీఎం కుటుంబం..

Wait 5 sec.

కొత్త పెళ్లి పెళ్లికూతురు రష్మిక ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఇటీవలే తన ప్రియుడు విజయ్ దేవరకొండని పెళ్లాడిన నేషనల్ క్రష్.. తమ వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఇన్వైట్ చేయడానికి సీఎం నివాసానికి వెళ్లారు. మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న ఈ వేడుకకు రావాల్సిందిగా రేవంత్ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారిగా తమ ఇంటికొచ్చిన రష్మికను రేవంత్ రెడ్డి దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు తెలుగు సంప్రదాయాన్ని పాటిస్తూ, నూతన వధువుకు కొత్త బట్టలు పెట్టి ఆశీర్వదించారు. సీఎం ఫ్యామిలీతో రష్మిక దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడారు. విజయ్ దేవరకొండతో తన పెళ్లి జరిగిన విధానాన్ని రేవంత్ భార్య గీతకు వివరించారని తెలుస్తోంది. వివాహానికి ముందు విజయ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా మీట్ అయిన సంగతి తెలిసిందే.సీఎం రేవంత్‌ ఫ్యామిలీని కలవడంపై రష్మిక ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ''తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గీత గారు, నైమిషా గారిని కలిశాను. వారితో అద్భుతమైన సమయం గడపడం, మా మధ్య జరిగిన మధురమైన సంభాషణలు చాలా బాగా అనిపించింది. నాకు బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.. నేను దానిని ఏదైనా సూపర్ స్పెషల్ సందర్భంలో పక్కా ధరిస్తాను'' అని పేర్కొన్నారు. రేవంత్ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను కూడా పంచుకున్నారు. ఇందులో రష్మికకి బొట్టు పెట్టి, చీర ఇచ్చి గౌరవించడాన్ని మనం చూడొచ్చు.గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న విజయ్ - రష్మిక జంట, ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. అందుకే మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. దీని కోసం సినీ, రాజకీయ, క్రీడా తదితర రంగాల ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షాలను విజయ్ - రష్మిక దంపతులు ఆహ్వానించారు. మరోవైపు కొత్త జీవితం ప్రారంభించిన సందర్భంగా విరోష్ జోడీ దేశవ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో స్వీట్లు పంచారు. పలు దేవాలయాల్లో అన్నదానం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్, హైదరాబాద్, కరీంనగర్, పుట్టపర్తి, విజయవాడ వంటి ప్రాంతాల్లో మిఠాయిలు పంచారు. నూతన దంపతులు హైదరాబాద్‌లో ఉన్న టీటీడీ ఆలయానికి వెళ్లి, స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ తమ చేతులతో అందరికీ స్వీట్లు పంచిపెట్టారు.