ప్రస్తుతం ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ దేశంలో భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్క తెలంగాణ నుంచే ఇరాన్‌లోని పలు నగరాల్లో 2 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే 900 మంది ఆ దేశంలో ఉన్నత చదువుల కోసం వెళ్లారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ సంయక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తుండగా.. ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తోంది. మరోవైపు.. ఇంటర్నేషనల్ విమానాలు భారీగా రద్దు కావడంతో ఆ దేశంలో చిక్కుకుపోయిన వారు.. తిరిగి స్వదేశాలకు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. దీంతో ఇరాన్‌లో చిక్కుకుపోయిన తమ పిల్లల కోసం ఇక్కడ వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దం ఇప్పుడు తెలంగాణ, మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులను తీవ్రంగా భయపెడుతోంది. హైదరాబాద్‌కు చెందిన 900 మంది విద్యార్థులు ఇరాన్‌లోని టెహ్రాన్, కుం వంటి నగరాల్లో చదువుకుంటున్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ శనివారం రోజున జరిపిన ఆకస్మిక దాడితో అక్కడ ఉన్న తెలుగు వారు తీవ్ర భయపడుతున్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ, టోలీచౌకి ప్రాంతాల్లోని విద్యార్థులను తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోవైపు.. తెలంగాణకు చెందిన 2000 మంది ఇరాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఇంజనీర్లతోపాటు బిజినెస్‌మెన్‌లు తరచూ హైదరాబాద్ నుంచి ఇరాన్‌కు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక ఇరాన్‌లో ఉన్న హైదరాబాదీలకు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇరాన్‌లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అక్కడి ప్రభుత్వం ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడంతో.. తమ వారి ఫోన్లు కూడా కలవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇరాన్‌‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించారు. ఇరాన్‌, గల్ఫ్‌ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. దాడుల నేపథ్యంలో అక్కడి అధికారులు సూచించే భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ఆ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు పాటించాలని తెలిపారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావద్దని హితవు పలికారు. ఇరాన్‌లో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో తాము సమన్వయం చేసుకుంటామని వివరించారు. పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.