తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. మార్చి 3వ తేదీ మంగళవారం రోజున టీటీడీ ఆధ్వర్యంలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి, తిరుచానూరులోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. 'తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్స్‌ ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్‌, అలాగే శ్రీనివాసం మరియు విష్ణునివాసం వసతి సముదాయాల్లో భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేస్తారు. అదేవిధంగా తిరుపతిలోని ప్రభుత్వ ఆస్పత్రులు, వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులతో పాటూ వారి సంరక్షకులకు అందించే అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేయనున్నారు' టీటీడీ తెలిపింది. అంతేకాదు చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని కూడా మార్చి 3వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మూసివేయనున్నారు. ఆలయాన్ని గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగానే ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. ఆలయాన్ని తిరిగి సాయంత్రం 7.30 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. భక్తుల్ని శ్రీవారి దర్శనానికి రాత్రి 8:30 గంట నుంచి అనుమతిస్తారు. కారణంగా టీటీడీ ఆర్జిత సేవల్ని కూడా రద్దు చేసింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. మార్చి నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 3న‌ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంట‌ల నుండి రాత్రి 7.30 గంట‌ల వరకు ఆలయం మూత. మార్చి 14న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. మార్చి 6, 13, 20, 27 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. మార్చి 19న ఉగాది సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు పుష్ప పల్లకీపై ఆలయ మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. అనంత‌రం రాత్రి 8 గంట‌ల‌కు పంచాంగ శ్ర‌వ‌ణం, ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. శ్రీ బలరామ‌కృష్ణ స్వామి ఆలయంలో మార్చి 24న రోహిణి నక్షత్రం సందర్భంగా శ్రీ కృష్ణ స్వామివారికి రాత్రి 7 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో మార్చి 6న హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో మార్చి 19న సాయంత్రం 05 గంట‌లకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం. మార్చి 7, 14, 21, 28 తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు ఉదయం 8 గంట‌లకు అభిషేకం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 నుండి రాత్రి 8 గంట‌ల వరకు ఆలయం మూత, అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు. మార్చి 19న ఉగాది సందర్భంగా ఉదయం 8 గంట‌లకు తిరువీధి ఉత్సవం, ఉదయం 9 గంట‌లకు ఉగాది ఆస్థానం, ఉదయం 10 గంట‌లకు పంచాంగ శ్రవణం. మార్చి 6, 13, 20, 27వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకారణ సేవ, అభిషేకం. మార్చి 11న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం. మార్చి 15న శ్రవణా నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం. మార్చి 1, 8, 15, 22, 29వ‌ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంట‌లకు అభిషేకం.