ఇక ప్రతీ సోమవారం ధర్మవాణి కార్యక్రమం.. ఏ సమస్య అయినా వారం రోజుల్లో పరిష్కారం

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కీలక సంస్కరణలకు తెరతీసింది. తమ శాఖ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ధర్మవాణి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు.. ఈ ధర్మవాణి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇక నుంచి.. ప్రతి సోమవారం నిర్వహించే ఈ ద్వారా.. ఆ శాఖలోని ఉద్యోగులు, అర్చకులు, సిబ్బంది.. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా డైరెక్టర్ హనుమంతరావు విననున్నారు. ఆ తర్వాత వాటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు.ఎండోమెంట్ కమిషనర్, డైరెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు.. ప్రతి సోమవారం రోజున ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్‌లోని డైరెక్టర్ కార్యాలయంలో.. ఉద్యోగులు, సిబ్బంది తమ ఫిర్యాదులు, విజ్ఞప్తులను అందించవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎంత కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది అయినా సరే ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా డైరెక్టర్‌ను కలిసి తమ బాధలు వెళ్లబోసుకునే అవకాశం కల్పించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తేల్చి చెప్పారు.ధర్మవాణి కార్యక్రమానికి వచ్చే దరఖాస్తులను స్వయంగా డైరెక్టర్ పరిశీలించనున్నారు. ఇక వారు అందించిన సమస్యలను బట్టి వెంటనే పరిష్కారం చూపించనున్నారు. ఇక మరికొన్ని పెద్ద సమస్యలు ఉంటే వాటిని గరిష్టంగా వారం రోజుల వ్యవధిలోనే పరిష్కరిస్తామని డైరెక్టర్ హనుమంతరావు హామీ ఇచ్చారు. కేవలం ప్రధాన కార్యాలయ సమస్యలే కాకుండా డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయాల పరిధిలో కూడా పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూడా ఈ ధర్మవాణి కార్యక్రమం ద్వారా పరిష్కరించనున్నట్లు స్పష్టం చేశారు.ఈ ధర్మవాణి కార్యక్రమానికి మరో ప్రత్యేకత ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఒక దరఖాస్తుపై తీసుకున్న నిర్ణయాన్ని సంబంధిత వ్యక్తులకు ఆ కార్యాలయం నుంచి.. ఫోన్, ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని అందించనున్నారు. ఒకవేళ టెక్నికల్, చట్టపరమైన కారణాల వల్ల ఏ సమస్యకైనా పరిష్కారం చూపించలేకపోతే.. దానికి గల కారణాలను కూడా దరఖాస్తు చేసిన వారికి పూర్తిగా వివరించనున్నారు. దీనివల్ల సేవల్లో మరింత పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.రాష్ట్రంలోని దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులు తమ సమస్యల కోసం ఉన్నతాధికారుల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఈ ధర్మవాణి కార్యక్రమాన్ని తీసుకువచ్చామని.. అయితే ఈ అవకాశాన్ని అందరు ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ హనుమంత రావు కోరారు. ఇది కేవలం ఫిర్యాదుల విభాగం మాత్రమే కాకుండా శాఖలో మరింత జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఒక మార్గంగా నిలుస్తుందని పేర్కొన్నారు.