తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు సౌర్యం కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డీనరీ బస్సుల్లో తెలంగాణ సరిహద్దులలోపు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇక అంతర్రాష్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో తెలంగాణ సరిహద్దు వరకు ఫ్రీగా జర్నీ చేయవచ్చు. అయితే ఈ పథకాన్ని దివ్యాంగులకు వర్తింపజేయాలని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దివ్యాంగులైనా సరే మహిళలకు ఎలాగూ మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్ జర్నీ కల్పిస్తుండగా.. దివ్యాంగ పురుషులు, బాలురకు కూడా వర్తింపజేయాలని డిమాండ్లు వచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. రాష్ట్రంలోని దివ్యాంగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన దివ్యాంగ పురుషులకూ ఇక నుంచి 100 శాతం ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం దివ్యాంగులైన పురుషులు రాయితీతో ప్రయాణాలు చేస్తున్నారు. టికెట్ ధర 100 ఉంటే 50 శాతం రాయితీ రూ. 50 చెల్లించి టికెట్ తీసుకొని జర్నీ చేసేవారు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా మహిళల మాదిరిగా జీరో టికెట్ తీసుకొని ఉచితంగా ప్రయణం చేసే వీలు కల్పించారు. అంటే దివ్యాంగులైన పురుషులు కూడా ఫ్రీ బస్ జర్నీకి అర్హులన్నమాట. ఇక సర్కార్ నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్ జర్నీ ద్వారా తమకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా రోజుకూ 25-30 లక్షల మధ్య ప్రయాణాలు సాగితే.. ప్రస్తుతం ఆ సంఖ్య 60 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కొత్త బస్సుల కొనుగోలుపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈవీ బస్సులు కొనుగోలు చేసి పలు మార్గాల్లో నడిపిస్తున్నారు. త్వరలోనే మరికొన్ని బస్సులు రోడ్డెక్కనున్నాయి. మహిళా సంఘాల ద్వారా కూడా బస్సులను కొనుగోలు చేయించి అద్దె ప్రతిపాదికన నడుపుతున్నారు.