ఎన్నికలైపోయినా ఆగని హింసాకాండ: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కారును వెంబడించి మరీ బుల్లెట్ల వర్షం

Wait 5 sec.

: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 207 స్థానాల భారీ మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించి.. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించిన 48 గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో ఘోర రక్తపాతం చోటుచేసుకుంది. బీజేపీ అగ్రనేత, ముఖ్యమంత్రి రేసులో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ బుధవారం రాత్రి ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యామ్‌గ్రామ్ పట్టణంలో దారుణ హత్యకు గురయ్యారు. నిందుతులు ఆయన కారును వెంబడించి మరీ బుల్లెట్ల వర్షం కురిపించగా.. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆపూర్తి వివరాలు మీకోసం.వెంబడించి.. తలకు, గుండెకు గురిపెట్టి కాల్పులు..!పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. బుధవారం రాత్రి చంద్రనాథ్ రథ్ తన కారులో ప్రయాణిస్తుండగా మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగులు ఆయన వాహనాన్ని వెంబడించారు. ట్రాఫిక్ కారణంగా కారు వేగం తగ్గగానే.. చంద్రనాథ్ కూర్చున్న వైపు నుంచి పాయింట్ బ్లాంక్ పరిధిలో దుండగులు 4 నుంచి 6 రౌండ్లు కాల్పులు జరిపారు. మూడు బుల్లెట్లు ఆయన తల, ఛాతి, కాలు భాగాల్లోకి బలంగా దూసుకెళ్లాయి. తీవ్ర రక్తస్రావమైన చంద్రనాథ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ దాడిలో కారు డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే సువేందు అధికారి ఆసుపత్రికి చేరుకోగా.. అక్కడ భారీగా బీజేపీ శ్రేణులు మోహరించాయి.మమతా బెనర్జీ సొంత నియోజక వర్గమైన భవానీపూర్‌లో సువేందు అధికారి చారిత్రాత్మక విజయం సాధించడంలో చంద్రనాథ్ రథ్ రాత్రింబగళ్లు శ్రమించి పని చేశారని బీజేపీ నేత కేయా ఘోష్ తెలిపారు. ఆ కక్షతోనే.. ఓటమిని తట్టుకోలేకపోయిన టీఎంసీ గూండాలు సుపారీ ఇచ్చి మరీ ఈ హత్య చేయించారని ఆమె ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని, వెనకుండి నడిపించిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇలా ఎన్నికల తర్వాత హింసాకాండ జరగడం బెంగాల్‌లో ఇదే మొదటి సారి కాదు. 2021 నాటి దారుణమైన ఎన్నికల అనంతరం కూడా హింస చెలరేగగా.. ఈ ఘటన దాన్నే గుర్తు చేస్తోంది.సీబీఐ దర్యాప్తునకు డిమాండ్..!మరోవైపు ఈ ఘాతుకాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పటికీ.. గత మూడు రోజుల్లో బీజేపీ శ్రేణుల చేతిలో తమ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారని టీఎంసీ ఆరోపించింది. చంద్రనాథ్ హత్యపై కోర్టు పర్యవేక్షణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరిపించాలని, ఈ రక్తాపాతానికి కారకులైన నిజమైన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేసింది.నిందితుల కోసం గాలిస్తున్నాం..!ఈ దారుణ ఘటనపై బెంగాల్ డీజీపీ సిద్ధనాథ్ గుప్తా స్పందిస్తూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, ఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు వాడినట్లుగా అనుమానిస్తున్న నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న ఒక వాహనాన్ని సీజ్ చేశామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా షూటర్ల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.